తెలంగాణ రాజకీయాల్లో ఏపీ పార్టీల సెగ: పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్.. టీడీపీకి రెడ్ కార్పెట్??

Pathi Sreenivas Rao
3 Min Read

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీకి చెందిన అధికార పార్టీల జోక్యం, దానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇస్తున్న ప్రతిస్పందన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల నేపథ్యంలో ఏపీ పార్టీల పట్ల తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరిస్తున్న ద్వంద్వ వైఖరి పలు రాజకీయ విమర్శలకు తావిస్తోంది….

జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించారు,తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 11 రోజుల పాటు అన్నం మానేశానని, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టే కారణమని గతంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తెలంగాణ రాజకీయాల్లోకి వస్తున్నారని పొన్నం మండిపడ్డారు.బీజేపీ ఇచ్చిన ప్యాకేజీలు తీసుకుని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని, ఏమైనా చేయాలనుకుంటే ఏపీలో చేసుకోవాలని ఆయన ఘాటుగా హెచ్చరించారు…

పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లోకి రావడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న కాంగ్రెస్ మంత్రులు, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) విషయంలో మాత్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది.మహానాడు వేదికగా ‘తెలంగాణ’ అనే పదమే తమ డిక్షనరీలో లేదని టీడీపీ గతంలో వ్యాఖ్యానించింది. అలాగే నారా లోకేష్ తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ నాయకులు ఎందుకు వ్యతిరేకించడం లేదన్నది ఆసక్తికరంగా మారింది ..
ఇటీవలే హైదరాబాద్‌లోని మైత్రీవనం వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆవిష్కరించారు అయితే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టినప్పుడు, అమరావతిలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టరంటూ ‘తెలంగాణ యంగ్ థింకర్స్ ఫోరం’ ప్రతినిధులు చంద్రబాబుకు లేఖ రాశారు దీనికి టీడీపీ మద్దతుదారులు స్పందిస్తూ.. జయశంకర్‌ను ‘ఆంధ్ర ద్రోహి’గా, ‘ఆంధ్ర వ్యతిరేకి’గా ముద్ర వేసి ఆయన విగ్రహం పెట్టడం కుదరదని తేల్చిచెప్పారు. తెలంగాణ సమాజం కూడా ఎన్టీఆర్‌ను అదే తరహాలో చూస్తున్నప్పటికీ, సీఎం రేవంత్ రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం, అక్కడ కేవలం టీడీపీ జెండాలు, చంద్రబాబు నినాదాలే మార్మోగడం గమనార్హం….

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడటానికి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి టీడీపీ మద్దతుదారులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా వ్యాఖ్యానించారు వాస్తవానికి 2018లో కాంగ్రెస్-టీడీపీ పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ ప్రభావం ఉందని భావించిన హైదరాబాద్‌లోని స్థానాల్లో సైతం భారీ పరాజయం పాలయ్యారు అయినా సరే సీఎం రేవంత్ హైదరాబాద్‌ను పరోక్షంగా టీడీపీ మద్దతుదారుల చేతుల్లో పెట్టడానికి సిగ్నల్స్ ఇస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ మహానగరం ఎవరి ఆధీనంలో ఉండాలన్నది కీలకం కానుంది. ఎన్డీయే కూటమిలోని బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనను మాత్రమే కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది అయితే అదే ఎన్డీయేలో ఉన్న టీడీపీకి మాత్రం పరోక్షంగా స్వాగతం పలుకుతోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారుల ఓట్లు కాంగ్రెస్‌కు పడతాయన్న ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ నేతలు టీడీపీని పల్లెత్తు మాట అనడం లేదన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి,మొత్తానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ
ఈ వ్యూహాత్మక ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment