తెలంగాణా /ఖమ్మం జిల్లా :
మధిర/చింతకాని: ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో కొందరు స్థానిక అధికార పార్టీ నాయకుల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఏకంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో, ఆయన పేరును అడ్డుపెట్టుకుని కొందరు కింది స్థాయి నేతలు సామాన్యులు, రైతులపై ప్రతాపం చూపుతున్నారు. తాజాగా చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో ఒక రైతు అధికార పార్టీ నాయకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు సిద్ధపడటం తీవ్ర కలకలం రేపుతోంది.వివారాల్లోకి వెళితే చింతకాని మండలం నాగులవంచ గ్రామానికి చెందిన జొన్నలగడ్డ మల్లికార్జున రావు అనే రైతు గత కొంతకాలంగా స్థానిక కాంగ్రెస్ నాయకుల చేతిలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వ్యవసాయం చేసుకుని జీవనం సాగించే తనను కొందరు స్థానిక నేతలు కావాలనే లక్ష్యంగా చేసుకుని, నిత్యం భయభ్రాంతులకు గురిచేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భూ వివాదాలు సృష్టించడం లేదా వ్యవసాయ పనులకు ఆటంకం కలిగించడం ద్వారా నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారని గ్రామస్తులు సైతం గుసగుసలాడుతున్నారు….
“ఏం పీక్కుంటారో పీక్కోండి” అంటూ బెదిరింపులు….
బాధితుడు మల్లికార్జున రావు తనకెందుకు ఈ అన్యాయం చేస్తున్నారని, న్యాయం చేయాలని స్థానిక నేతలను నిలదీయగా.. వారు మరింత బరితెగించి మాట్లాడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. “మాకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అండ ఉంది.. మీరెంత గింజుకున్నా ఏమీ కాదు, ఏం పీక్కుంటారో పీక్కోండి.. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి” అంటూ తీవ్ర పదజాలంతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. రాష్ట్ర స్థాయిలో అత్యంత బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మల్లు భట్టి విక్రమార్క పేరును వాడుకుని, ఆయన నియోజకవర్గంలోనే స్థానిక నేతలు ఈ తరహా దౌర్జన్యాలకు దిగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది….
ఆత్మహత్యే శరణ్యం అంటున్న రైతు…
అధికార పార్టీ నాయకుల బెదిరింపులు, స్థానిక యంత్రాంగం నుండి సరైన స్పందన లేకపోవడంతో బాధితుడు జొన్నలగడ్డ మల్లికార్జున రావు తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. తనకు న్యాయం జరిగే దారి కనిపించడం లేదని, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమని ఆయన కన్నీరుమున్నీరు అవుతున్నాడు. బతకనిచ్చే పరిస్థితి లేనప్పుడు తనకు ఇక “ఆత్మహత్యే శరణ్యం” అంటూ ఆయన కన్నీటి పర్యంతం కావడం పలువురిని కలచివేస్తోంది…
ఉన్నతాధికారులు స్పందించాలి….
ఈ ఘటనపై ఉన్నతాధికారులు, స్వయంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.పోలీసు అధికారులు తక్షణమే స్పందించి రైతు మల్లికార్జున రావుకు రక్షణ కల్పించాలని,ఉపముఖ్యమంత్రి పేరు చెప్పుకుని బెదిరింపులకు పాల్పడుతున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతుకు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకునే వాతావరణం కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి,సామాన్యులకు అండగా ఉండాల్సిన నాయకులే భక్షకులుగా మారితే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని పలు ప్రజా సంఘాలు, ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
