తెలంగాణా /ఖమ్మం జిల్లా :
ఖమ్మం: వివాహేతర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చాలని ఓ భార్య వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. ఇంట్లో కాకుండా బయట యాక్సిడెంట్ చేసి చంపేయాలని, లేదంటే తాను చనిపోతానంటూ ప్రియుడికి పంపిన వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ మెసేజ్లను చూసిన భర్త ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. భార్య, ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినప్పటికీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికంగా కలకలం రేపుతోంది.మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడుకు చెందిన గాదే రాజేశ్వరరావుకు, సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన భవానితో 2016లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజేశ్వరరావు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో భవాని,ఓ కొరియర్ బాయ్ సైదులుతో పరిచయం పెంచుకుని, అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది….
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న భర్త….
ఈ నేపథ్యంలో గత నెల 27న మధ్యాహ్నం భోజనం చేసేందుకు రాజేశ్వరరావు ఇంటికి వెళ్లాడు. అక్కడ తన భార్య భవాని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యాడు.ఈ క్రమంలో వారిద్దరి మధ్య ఉన్న వివాహేతర సంబంధం బట్టబయలైంది. ఈ విషయంపై గత నెల 28న చిలుకోడులో పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. పంచాయితీ అనంతరం పక్క ఊరిలో ఉంటున్న తన అన్నను తీసుకురావడానికి రాజేశ్వరరావు వెళ్తుండగా, భవాని ప్రియుడు సైదులు అతన్ని వెంబడించాడు. ప్రమాదాన్ని పసిగట్టిన రాజేశ్వరరావు అతని నుండి చాకచక్యంగా తప్పించుకుని తిరిగి చిలుకోడు చేరుకున్నాడు.
చాటింగ్ చూసి ఖంగుతిన్న బాధితుడు….
అనుమానంతో భార్య భవాని ఫోన్ను రాజేశ్వరరావు చెక్ చేయగా, వారి దారుణమైన ప్లాన్ వెలుగులోకి వచ్చింది.“ఎలాగైనా సరే అతన్ని (భర్తను) చంపేయాలి. ఇంట్లో కాకుండా బయట ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి చంపాలి. లేదంటే నేను చనిపోతాను”అంటూ తన ప్రియుడు సైదులుకు భవాని వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో పంపిన మెసేజ్లను చూసి రాజేశ్వరరావు హడలిపోయాడు. పక్కాగా ప్లాన్ చేసి తనను మట్టుబెట్టాలని చూస్తున్నారని గ్రహించి, వెంటనే ఆ చాటింగ్ మొత్తాన్ని స్క్రీన్షాట్లు తీసుకున్నాడు…..
పట్టించుకోని పోలీసులు.. ఆందోళనలో బాధితుడు….
చాటింగ్ ఆధారాలతో సహా ఈ నెల 1న తన భార్య, ఆమె ప్రియుడిపై డోర్నకల్లు పోలీస్ స్టేషన్లో రాజేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ‘జీరో ఎఫ్ఐఆర్’ (Zero FIR) నమోదు చేసి, కేసును ఖమ్మం రూరల్ స్టేషన్కు బదిలీ చేశారు. అయితే, రూరల్ పోలీసులు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే చంపాలని చూసిన భార్య స్వేచ్ఛగా తిరుగుతుండటం,తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉండటంతో గురువారం మరోమారు ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో రాజేశ్వరరావు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రూరల్ సీఐ.. ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. భర్తను అడ్డుతొలగించుకునేందుకు భార్య పన్నిన ఈ పన్నాగం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
