తెలంగాణ /హైదరాబాద్ :
హైదరాబాద్:ఖమ్మం నగరంలో లైంగిక దాడికి గురై, తీవ్ర గాయాలతో హైదరాబాద్లోని నిమ్స్ (NIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనర్ బాలికను రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం పరామర్శించారు. ఆసుపత్రి ఐసీయూలో అత్యవసర చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పరిస్థితిని చూసి మంత్రి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు బాలిక ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు…..

వైద్యులతో సమీక్ష..ప్రత్యేక శ్రద్ధకు ఆదేశం…
నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రాహుల్ నాతో పాటు అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య బృందంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. బాలికకు ప్రస్తుతం అందుతున్న వైద్య చికిత్సల వివరాలను, ఆమె కోలుకుంటున్న తీరును అడిగి తెలుసుకున్నారు.బాలికకు అత్యంత మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని డైరెక్టర్ను ఆదేశించారు.చికిత్సకు సంబంధించి ఎటువంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా, ఎలాంటి అవసరాలు ఉన్నా నేరుగా ముందుగా తనకే సమాచారం అందించాలని స్పష్టం చేశారు. వైద్యులతో పాటు నిమ్స్ ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ను తనకు నివేదించాలని సూచించారు…అనంతరం ఆసుపత్రి వద్ద ఉన్న బాలిక తల్లిదండ్రులను మంత్రి తుమ్మల పరామర్శించి, వారిని ఓదార్చారు. ఈ కష్టకాలంలో గుండె నిబ్బరంతో ఉండాలని, ధైర్యం చెప్పారు. “నేను ఉన్నాను.. మీకు అండగా ఉంటాను. ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలను అందిస్తాం”అని వారికి గట్టి భరోసా ఇచ్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు….
ఐసీడీఎస్ అధికారులకు కఠిన ఆదేశాలు….
ఈ ఘటనపై ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ (ICDS) అధికారులతో మంత్రి తుమ్మల ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆసుపత్రిలో ఉన్న బాలికతో పాటు, ఆమె తల్లిదండ్రుల బాగోగులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. వారికి అవసరమైన వసతులు, భోజన సదుపాయాలు కల్పించాలని, ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నివేదికను తనకు పంపాలని అధికారులను ఆదేశించారు.ఈ అమానుష ఘటనపై ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండగా, ప్రభుత్వం బాధితురాలికి అండగా నిలబడటమే కాకుండా, నిందితులపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠిన చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
