సీఎం.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో “గడ్డ పార”రాజ్యాన్ని నడుపుతుండు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు!!

Pathi Sreenivas Rao
4 Min Read
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు....
Highlights
  • రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే పేదల ఇళ్ల కూల్చివేత,రేవంత్ సర్కార్‌ది ప్రజా ప్రభుత్వం కాదు.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వం.....
  • ఖమ్మంలో గడ్డపార రాజ్యం.. అర్ధరాత్రి పూట అమానుషంగా పేదల గెంటివేత....
  • కోర్టు ఆదేశాలు బేఖాతరు.. 4000 మంది పోలీసులతో పేదల గుడిసెలపై దౌర్జన్యం.....
  • మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజం.....

తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు నారపురాజు రామచంద్రరావు ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా ఇటివల వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలను తొలగించిన క్రమంలో ప్రాంతంలో ఆశ్రయం కోల్పోయిన బాధితులను పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను దౌర్జన్యంగా కూల్చివేసిందని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు,న్యాయస్థానం ఆదేశాలను ఖాతరు చేయకుండా తెల్లవారుజామున భారీ బలగాలతో చిన్నారులు, వృద్ధులు అని చూడకుండా పేదలను వీధిన పడేయడం దారుణమని మండిపడ్డారు,బాధితులందరికీ అక్కడే నివాస స్థలాలు కేటాయించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….

ఈ సందర్భంగా బాధితులు తమ గోడును రామచంద్రరావు ముందు వెళ్లబోసుకున్నారు. గత వారం రోజుల నుంచి ఖమ్మంలో భూదాన యజ్ఞ సంస్థ నిర్వాసితుల ఆక్రందన యావత్తు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు,ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని 147,148,149 సర్వే నెంబర్లలో ఉన్న భూముల్లో గత పదిహేను సంవత్సరాలుగా దాదాపు ఆరు వందల పేద కుటుంబాలు నివాసం ఉంటున్నాయని పద్దెనిమిది వందల మందికి పైగా నిరుపేదలు కూలి పనులు చేసుకుంటూ పైసా పైసా కూడబెట్టుకుని వంద గజాల చొప్పున స్థలాన్ని ఏర్పాటు చేసుకుని చిన్నపాటి గుడిసెలు నిర్మించుకున్నారని,రాష్ట్ర ప్రభుత్వం కనీస కనికరం లేకుండా ఆ ఇళ్లను నేలమట్టం చేసిందని రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు,ఉన్నత న్యాయస్థానం యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను ఏమాత్రం ఖాతరు చేయలేదని ఆరోపించారు,ఆ పత్రాలు అసలైనవి కావని కుంటి సాకులు చెబుతూ పేదల ఇళ్లపై భారీ యంత్రాలను ప్రయోగించారని మండిపడ్డారు,పక్కనే జాతీయ రహదారి రావడం వల్ల భూమి విలువ పెరిగిందని, అధికార వర్గాలకు అత్యంత సన్నిహితులైన స్థిరాస్తి వ్యాపారులకు ఆ భూములను కట్టబెట్టేందుకే దాడులు చేశారని విమర్శించారు. తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో నాలుగు వేల మంది భద్రతా బలగాలతో దౌర్జన్యంగా నిరుపేదల గూడు చెదరగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీలు, వృద్ధులు, పసిపిల్లలు, రోగులు అని కూడా చూడకుండా, ఉజ్వల భవిష్యత్తు కోసం పుస్తకాలు చదువుకుంటున్న విద్యార్థులను సైతం అమానుషంగా లాగి బయటపడేశారని ధ్వజమెత్తారు.
పేదలు తమ రెక్కల కష్టంతో కొనుగోలు చేసుకున్న నిత్యావసర వస్తువులు, బియ్యం బస్తాలు, కాయగూరలు, పప్పు దినుసులు, పిల్లల చదువుల పుస్తకాలు అన్నీ శిథిలాల కింద కలిసిపోయాయని విచారం వ్యక్తం చేశారు. కనీసం ఆ వస్తువులను బయటకు తీసుకునే అవకాశం కూడా ఇవ్వకుండా వ్యవహరించడం శోచనీయమన్నారు…..

అనంతరం ఖమ్మం నగరంలోని అంబేడ్కర్ భవనంలో తలదాచుకున్న బాధిత కుటుంబాలను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పరామర్శించారు,ఈ కష్టకాలంలో వారికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో గునపం పట్టుకుని ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇల్లు కూలగొడుతున్నారని రామచంద్రరావు దుయ్యబట్టారు,ఇది ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రభుత్వం ఏమాత్రం కాదని, పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వమని ధ్వజమెత్తారు,భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ అణగారిన వర్గాల పక్షాన నిలబడుతుందని ఉద్ఘాటించారు,బాధితులకు అదే స్థలంలో వంద గజాల చొప్పున స్థలాలు ఇచ్చి, ప్రభుత్వమే తన సొంత ఖర్చులతో వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాటం నిరంతరం కొనసాగుతుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు భవిష్యత్తులో స్థానిక ప్రజలతో కలిసి భారీ ఎత్తున ఉద్యమిస్తామని పాలకులను హెచ్చరించారు…..

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు , భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు, జిల్లా ఇంచార్జ్ బద్ద మహిపాల్ రెడ్డి, నాయకులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, ఉప్పర్ల శారద, గల్లా సత్యనారాయణ , శీలం పాపారావు, దొంగల సత్యనారాయణ, మందడపు సుబ్బారావు, గుత్తా వెంకటేశ్వర్లు, వీరవల్లి రాజేష్, బండారు నరేష్, నున్న రవికుమార్, విజయరాజు, దొడ్డ అరుణ, రజినీ రెడ్డి, కుమిలి శ్రీనివాస్, రవి రాథోడ్, శ్యామ్ రాథోడ్, ఏలూరి నాగేశ్వరరావు, నీరుకొండ ఉషారాణి, పమ్మీ అనిత కందుల శ్రీకృష్ణ, మందా సరస్వతి, శ్రీ రామనేని మనీ , నకిరేకంటి వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment