పువ్వాడ ఉదయ్ నగర్లో తోడు దొంగల ఘనకార్యాలు, చోద్యం చూస్తున్న రెవిన్యూ అధికారులు!!

Pathi Sreenivas Rao
2 Min Read
.

ఖమ్మం పట్టణానికి కూతావేటు దూరంలో విప్లవ యోధుడు పువ్వాడ ఉదయ్ కుమార్ పేరున వెలసిన గ్రామం,కన్న తల్లి లాంటి ఊరు
“పువ్వాడ ఉదయ్ నగర్” ఆ ఊరు అమ్మలా అందరిని అక్కున చేర్చుకుంది,అయింత నిలవడానికి నీడనిచ్చింది,అలసి సొలసిన మట్టి మనుషులకు సేద దీర గూడునిచ్చింది,కానీ కొందరు ప్రభుద్ధులు ఆ అమ్ననే అమ్మకానికి పెట్టి కోట్లకు పడగలెత్తారు,కట్టు బట్టలతో పొట్ట చేతబట్టుకుని అమ్మ లాంటి ఊరుకు వలస వచ్చి పదేండ్లలో “అమ్మ లాంటి ఊరును” అంగట్లో సరుకులాగా అమ్ముకు తిన్నారు….

ఆ గడ్డ మీద పుట్టినోడు ఎవడూ లేడు అందరూ పొట్టకూటికోసం వలస వచ్చినవాళ్ళే తాయత్తులు కడుతూ, క్షుద్ర పూజలు చేస్తానంటూ ఒకడు, సెంట్రింగ్ మేస్త్రినంటూ ఒకడు ఎక్కడెక్కడినుంచో వలసొచ్చి తోడు దొంగలయ్యారు,కన్న తల్లి లాంటి ఉన్న ఊరును చెరబట్టారు,గజాలెక్కన పంచుకున్నారు,రెవిన్యూ అధికారుల సంతకాలు పోర్జరీలు చేశారు,నకిలీ పట్టాలు తయారు చేశారు నిలువ నీడలేనోళ్లని, నమ్మించారు వాళ్ళ పేరుమీద నకిలీ పట్టాలు సృష్టించారు,వాళ్లకు అంటగట్టారు ఆ నిరుపేదల రక్తపు కూడు నీకింత,నాకింత అంటూ తోడు దొంగలిద్దరు పంచుకున్నారు,అర్ధాకలితో అలమటిస్తున్న పేద కూలీల పచ్చి నెత్తురు కాసుల రూపంలో త్రాగారు…..

నాణేనికి బొమ్మబోరుసు ఎలాగో వీళ్ళు కూడా అలాగే…వీడు అధికారంలో ఉంటే వీడు,వాడు అధికారంలో ఉంటే వాడు అంతర్గతంగా సహకరించుకుంటారు,బయటకు మాత్రం అమాయక ప్రజలను నమ్మించడానికి శత్రువులుగా నటిస్తారు,వీళ్లిద్దరి లక్ష్యం ఒక్కటే ఇద్దరూ కలిసి అందినకాడికి దోచుకోవడమే,మూడు పూటలా దొరకని స్థితిలో రేషన్ బియ్యం కోసం ఎదురు చూసే స్థాయి నుండి కుక్కకి బాసుమతి రైస్ బిర్యాని పెట్టే స్థాయికి ఎలా ఎదిగారు?…రోజూ కూలికి వెళితే గానీ పూట గడవని పరిస్థితుల నుండి నేడు లగ్జరి కార్లు,జేసీబిలు ,లారీలు,ట్రాక్టర్లు, బుల్లెట్ బండ్లు ఎలా వచ్చాయి? గత పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ గా గెలవడం కోసం లక్షల రూపాయలు ఎలా ఖర్చు చేయగలిగారు? పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగినట్లు సర్పంచులుగా గెలిపిస్తే వీళ్ళు చేసిందేమిటి,ప్రస్తుతం చేస్తున్నాదేమిటి? అధికారాన్ని అడ్డంపెట్టుకుని భూతల్లిని సెంటిమీటర్ల లెక్కన అమ్ముకుని దీపం ఉన్నపుడే ఇల్లు చక్క బెట్టుకున్నారు, వందల కోట్లకు పడగలెత్తారు….

పువ్వాడ ఉదయ్ నగర్లో 2009 లో పేదలకు ప్రభుత్వం
ఎన్ని పట్టాలు ఇచ్చింది,ప్రస్తుతం ఎన్ని వేల నకిలీ పట్టాలు ఉన్నాయి,ఈ నకిలీ పట్టాలు సృష్టి వెనుక ఉన్న తోడు దొంగలు ఎవరు,ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహ చేశారు, ఈ భూబాగోతమంతా ఎవరి కనుసన్నళ్ళో నడుస్తుంది, ఇంత జరుగుతున్నా రెవిన్యూ అధికారులు ఎందుకు నోరు మెదపడంలేదు,గత ప్రభుత్వంలో వాళ్లకు సహకారం అందించింది ఎవరు? ప్రస్తుతం సహకరిస్తున్న ఆ నలుగురు అధికార పార్టీ నాయకులు ఎవరు? పూర్తి డాక్యుమెంటరీ ఆధారాలతో రేపటి నుండి మీ “జనం ముచ్చట” లో వరుస కథనాలు……

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment