తెలంగాణ /ఖమ్మం జిల్లా :
సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం సాగునీటి కష్టాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి సత్తుపల్లి మండలంలోని యాతాలకుంట టన్నెల్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతిని అడిగి తెలుసుకున్న అనంతరం అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు….
గత పాలకుల్లా డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేయం…..
ఈ సమీక్షా సమావేశం అనంతరం మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తమ ‘ఇందిరమ్మ ప్రభుత్వం’ ఎటువంటి బేషజాలకు పోవడం లేదన్నారు. గత ప్రభుత్వం నిలిపివేసిన సీతారామ ప్రాజెక్టు పనులను తమ ప్రభుత్వం అత్యంత వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తోందని పేర్కొన్నారు. గత పాలకుల మాదిరిగా డిజైన్ల మార్పుల పేరుతో కాలయాపన చేసే ఉద్దేశం తమ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని కుండబద్దలు కొట్టారు…..
రైతులకు అండగా ఇందిరమ్మ రాజ్యం….
ప్రస్తుతం నెలకొన్న కరువు పరిస్థితుల్లోనూ రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా సుమారు 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేసి, అన్నదాతలకు అండగా నిలిచామని ఆయన గుర్తు చేశారు.ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. సీతారామ ప్రాజెక్టు భూసేకరణ పనుల నిమిత్తం తక్షణమే రూ. 135 కోట్లను విడుదల చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించినట్లు ఆయన ప్రకటించారు.అంతే కాకుండా నిధుల విడుదలకు సంబంధించిన బిల్లులను తక్షణమే సిద్ధం చేయాలని,వెంటనే టోకెన్లు పంపాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.పనుల వేగాన్ని బట్టి, ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా బిల్లులు క్లియర్ చేస్తామని గుత్తేదారులకు, అధికారులకు భరోసా ఇచ్చారు….ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్లు దివాకర టి.ఎస్, అంకిత్, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు మట్టా రాగమయి దయానంద్, నీటిపారుదల, రెవెన్యూ శాఖల ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నిధుల విడుదలతో ప్రాజెక్టు పనులు మరింత వేగవంతం కానున్నాయని స్థానిక రైతాంగం హర్షాతిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
