తెలంగాణ /ఖమ్మం జిల్లా:
రిపోర్టర్ సత్తెనపల్లి శివ, వైరా :గత యూపీఏ ప్రభుత్వం వామపక్షాల మద్దతుతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని’ నిర్వీర్యం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘వి.బి.జి రాంజీ’ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వైరా రూరల్ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.ఈ కొత్త చట్టాన్ని రద్దు చేసి పాత ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ.. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూ (CITU) తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కూలీలు ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులకు తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను (మెమోరాండం) అందజేశారు….
లింగన్నపాలెం, విప్పలమడక గ్రామాల్లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో బాణాల శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రెక్కాడితే గాని డొక్కాడని ఎంతో మంది నిరుపేదలు ఈ ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఈ కొత్త చట్టం వల్ల పేదలు ఉపాధి కోల్పోవడమే కాకుండా, వారికి చట్టబద్ధంగా దక్కాల్సిన హక్కులు, కనీస సౌకర్యాలు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి పనుల్లో కోత విధించాలనే దురుద్దేశ్యంతోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో దీనికి కేవలం రూ. 95 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆయన విమర్శించారు….
ఈ సందర్బంగా ప్రభుత్వం ముందు ప్రజా సంఘాలు ప్రధానంగా 8 డిమాండ్లను ఉంచాయి…కేంద్రం కొత్తగా తెచ్చిన ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని,జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధాతథంగా కొనసాగించాలని అలాగే పని ప్రదేశంలో రోజుకు రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలని,ఉపాధి కూలీలకు అవసరమైన పనిముట్లను ప్రభుత్వమే అందించడమే కాకుండా పని ప్రదేశంలో కూలీలకు మంచినీటి సౌకర్యం, టెంట్లు, మెడికల్ కిట్లను అందుబాటులో ఉంచాలని కూలీలు చేసిన పనికి గరిష్టంగా 15 రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని అంతే కాకుండా పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా రోజువారీ కనీస వేతనాన్ని రూ. 600లకు పెంచాలని ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 200 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు….
ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, లేనిపక్షంలో వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సీఐటీయూల ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్మిస్తామని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమాల్లో రైతు, వ్యవసాయ కార్మిక, సీఐటీయూ సంఘాల నాయకులు బాణాల కృష్ణమాచారి, సజ్జా నాగేశ్వరరావు, కొర్ర కొప్పు ఇర్మియ, చెంగల తిరుపతమ్మ, షేక్ యాకూబ్ అలీ, గరిడేపల్లి సీతారాములు, గరిడేపల్లి సుబ్బారావు, రుద్రాక్షల వెంకటాచారి, సత్తెనపల్లి మాధవి, షేక్ ఖాదర్ బి, బాణాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
