తెలంగాణ /ఖమ్మం జిల్లా :
చింతకాని : ఖమ్మం జిల్లా చింతకాని వేదికగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘రైతు ఆశీర్వాద సభ’కు సర్వం సిద్ధమవుతోంది. ఈ నెల 30న (మంగళవారం) రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలతో రైతులకు కొండంత అండగా నిలుస్తోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సభా ఏర్పాట్లను ఆదివారం ఆయన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు…..

పకడ్బందీగా సియం సభా ఏర్పాట్లు….
చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొంగులేటి అంగుళం అంగుళం పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో, వాతావరణ మార్పులను తట్టుకునేలా జర్మన్ హ్యాంగర్లతో అద్భుతమైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ స్థలాలను వీక్షించి పలు సూచనలు చేశారు. భారీ వర్షాల సూచనలు ఉన్నప్పటికీ, ఏ విపత్తు ఎదురైనా ఈ సభ అనుకున్న దానికంటే డబుల్, త్రిబుల్ సక్సెస్ కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కల ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని
ఈ సభను చారిత్రాత్మక విజయంగా మలుస్తామన్నారు….

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం….
గత రెండున్నరేళ్లుగా ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాటను అక్షరాలా నిలబెట్టుకుంటూ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో క్యాబినెట్ సాహసోపేత నిర్ణయం తీసుకుని, వర్షాలకు తడిసిన ధాన్యాన్ని సైతం మానవీయ కోణంలో కొనుగోలు చేసిందన్నారు. కేవలం కొనడమే కాకుండా, కొనుగోలు చేసిన వారం రోజుల లోపలే రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేసిన నిఖార్సైన రైతు పక్షపాత ప్రభుత్వం ఇది అని ఆయన కొనియాడారు….

గత పాలకులవి ముసలి కన్నీళ్లు: మంత్రి పొంగులేటి ధ్వజం….
గత పదేళ్ల పాలకుల తీరుపై మంత్రి పొంగులేటి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజలు తమ వైపు చూడటం లేదనే తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ప్రతిపక్ష నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
ఇదే ఖమ్మం పట్టణంలో గతంలో వాళ్లు అధికారంలో ఉన్నప్పుడు, రైతుల కష్టాలు పట్టించుకోకుండా, నడిరోడ్డుపై అన్నదాతలకు సంకెళ్లు వేసి జైలుకు పంపించిన దుర్మార్గాన్ని ఈ జిల్లా ప్రజలు ఎన్నటికీ మరవరు. నాడు రైతులను విస్మరించి, హింసించిన వాళ్లే.. నేడు ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమ ఒలకబోస్తున్నారు. ఈ రాజకీయ డ్రామాలను రైతులందరూ గమనిస్తూనే ఉన్నారు.” అని మంత్రి హెచ్చరించారు….ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, జారే ఆదినారాయణ, మట్టా రాగమయి దయానంద్, రాందాస్ నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, తోట దేవీ ప్రసన్న, వ్యవసాయ శాఖ కార్యదర్శి కే. సురేంద్ర మోహన్, కమిషనర్ గోపి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, సీపీ సునీల్ దత్ తదితరులు పాల్గొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
