తెలంగాణ/జయశంకర్ భూపాలపల్లి జిల్లా:
జయశంకర్ భూపాలపల్లి: విధి నిర్వహణలో ఉన్న ఓ ఉన్నతాధికారి రోడ్డు ప్రమాదంలో దారుణంగా ప్రాణాలు కోల్పోవడం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. జిల్లా రవాణా శాఖ అధికారి (DTO) వెంకన్న నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ బొగ్గు లారీ ఆయన పాలిట మృత్యుశకటంగా మారింది. ఇది కేవలం ప్రమాదమా? లేక ఏమైనా కుట్ర కోణం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి….వివరాల్లోకి వెళితే.. చెల్పూర్ సమీపంలో డీటీఓ వెంకన్న తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో సరైన ధృవీకరణ పత్రాలు లేని ఓ వరికోత మిషన్ (హార్వెస్టర్)ను ఆయన సీజ్ చేశారు. దానిని భూపాలపల్లిలోని జిల్లా రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయానికి తరలించారు. ఆఫీస్ గేటు వద్ద వెంకన్న కింద నిలబడి ఆ హార్వెస్టర్ను లోపలికి పంపిస్తుండగా.. అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఓ భారీ లారీ అదుపుతప్పి హార్వెస్టర్ను ఢీకొట్టి, నేరుగా డీటీఓ వెంకన్న పైకి దూసుకెళ్లింది. ఆయన నడుము, పొత్తికడుపు భాగం పైనుంచి లారీ టైర్లు వెళ్లడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు.వెంకన్న కేవలం 25 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లా డీటీఓగా బాధ్యతలు స్వీకరించారు. విధి నిర్వహణలో ఎంతో చురుకుగా ఉంటూ, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కొరడా ఝుళిపిస్తున్న ఆయన.. ఇలా విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు…..
ప్రమాదానికి కారణమైన లారీ తాడిచెర్ల నుంచి జెన్కో (GENCO) కు బొగ్గు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించగా, మద్యం తాగలేదని నిర్ధారణ అయింది. అయితే లారీ బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఈ ఘోరం జరిగిందా? లేక మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం కారణమా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. దీనిపై మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) ఇచ్చే సాంకేతిక రిపోర్టు ఆధారంగా ప్రమాదానికి అసలు కారణం నిర్ధారించనున్నట్లు పోలీసులు వెల్లడించారు. త్వరలోనే కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించనున్నారు…..ఈ దుర్ఘటనపై రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చ మొదలైంది.డీటీఓ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని, తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే ఈ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇసుక, బొగ్గు మాఫియాని అడ్డుకుంటే అధికారులను చంపేస్తారా?”* అంటూ ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ మృతిపై సమగ్ర విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు….
భూపాలపల్లి, రామగుండం లాంటి కోల్ బెల్ట్ (బొగ్గు గనులు) ప్రాంతాల్లో భారీ వాహనాలు, ముఖ్యంగా బొగ్గు మరియు ఇసుక రవాణా చేసే లారీలు నిబంధనలు గాలికి వదిలేసి మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటం నిత్యకృత్యంగా మారింది. రోజుకు వందల సంఖ్యలో తిరిగే ఈ లారీల కారణంగా తరచూ అమాయకుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రోడ్డు భద్రతను పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ ఉన్నతాధికారికే ఈ స్థాయిలో భద్రత లేకపోతే, ఇక సామాన్యుల పరిస్థితి ఏంటన్న ఆందోళన స్థానికుల్లో వ్యక్తమవుతోంది. ఈ ఘటన తర్వాతనైనా రవాణా, పోలీసు శాఖలు సమన్వయంతో భారీ వాహనాల వేగ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే బొగ్గు, ఇసుక రవాణా మాఫియా ఆగడాలకు మరింత మంది ప్రాణాలు బలయ్యే ప్రమాదం ఉంది…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్:9703973456
