తిరుమల శ్రీవారి సేవలో మాజీ మంత్రి “పువ్వాడ అజయ్ కుమార్” కుటుంబం!!

Pathi Sreenivas Rao
2 Min Read

తిరుమల, జూన్ 18: కలియుగ ప్రత్యక్ష దైవం, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్న ఆయన.. ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్బంగా శ్రీవారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మాజీ మంత్రి అజయ్ కుమార్ మరియు ఆయన కుటుంబ సభ్యులకు ఆలయ వేద పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు….

దర్శన అనంతరం ఆలయం వెలుపల పువ్వాడ అజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. రెండు ప్రాంతాలు అభివృద్ధి పథంలో అద్భుతంగా ముందుకు దూసుకుపోతున్నాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులోనూ ఇతర విషయాల్లో తెలుగు ప్రజలు ఎటువంటి అనవసర భావోద్వేగాలకు లోనుకాకుండా, కలిసిమెలిసి ప్రగతి సాధించేలా శ్రీవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో తిరుమలలో ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.

ఈ సందర్భంగా తన తండ్రి, సీపీఐ పక్ష మాజీ నేత పువ్వాడ నాగేశ్వరరావు గారిని ఆయన గుర్తు చేసుకున్నారు. తన తండ్రి గత 30 ఏళ్లుగా క్రమం తప్పకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో సైతం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అశేషంగా ఉన్నారని, ప్రతి పల్లెలోనూ స్వామివారి ఆలయాలు దర్శనమిస్తాయని ఆయన పేర్కొన్నారు.ముఖ్యంగా.. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన ‘ఎల్ నినో’ విపత్తు ప్రభావం నుంచి రైతాంగానికి ఉపశమనం కలగాలని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలతో రైతులు సంతోషంగా ఉండాలని శ్రీవారిని మనసారా ప్రార్థించినట్లు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆ శ్రీనివాసుడు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎల్లప్పుడూ చల్లగా చూడాలని ఆయన ఆకాంక్షించారు…..

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment