తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం/వైరా, జూన్ 13: ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ, సహజ వనరులను కొల్లగొడుతున్న ఇసుక మాఫియాపై వైరా పోలీసులు ఉక్కుపాదం మోపారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న ఓ ముఠాను పట్టుకుని, వారి నుంచి భారీ స్థాయిలో ఇసుకను, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారు పాత నేరస్తులే కావడంతో వారిపై హిస్టరీ షీట్లు తెరిచేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు….

ఇసుక రవాణాలో తండ్రి కొడుకులే సూత్రదారులు….
వైరా పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం పోలీసులు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు.ఈ తనిఖీల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ రీచ్ నుండి తెలంగాణకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న చల్లమల్ల వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు చల్లమల్ల సుమంత్ కుమార్, లారీ డ్రైవర్ కొండేటి ఉపేందర్.అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇసుక రవాణాకు సంబంధించి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు, మైనింగ్ పర్మిట్లు, ట్రాన్స్పోర్ట్ చలానాలు, ఈ-వే బిల్లులు వారి వద్ద లేవు. సుమారు 25 టన్నుల ఇసుకను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.ఈ అక్రమ రవాణా వ్యవహారంలో ఖమ్మం నగరానికి చెందిన తండ్రీకొడుకులు ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు…..
నిందితులపై అనేక కేసులు…..
అంతే కాకుండ ఇసుక రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ, పోలీసుల కళ్లు గప్పేందుకు ఎస్కార్ట్ వాహనంగా వినియోగించిన మహీంద్రా థార్ కారు, అలాగే విక్రయాల కోసం ఉపయోగిస్తున్న మరో టిప్పర్ వాహనాన్ని పోలేసులు అదుపులోకి తీసుకున్నారు,ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు అక్రమంగా ఇసుకను కొనుగోలు చేయడం, దానిని ఖమ్మం సహా తెలంగాణలోని ఇతర ప్రాంతాలకు తరలించి అధిక ధరలకు విక్రయించి భారీగా లాభాలు గడించడం వీరి ప్రధాన వ్యూహంగా దర్యాప్తులో వెల్లడైంది.పట్టుబడిన నిందితుల నేర చరిత్రను పోలీసులు పరిశీలించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.ప్రధాన నిందితుడు చల్లమల్ల సుమంత్ కుమార్పై గతంలో ఏకంగా 12 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వీటిలో పలు కేసుల్లో అతనికి న్యాయస్థానం శిక్షలు కూడా విధించింది.ఆయన తండ్రి చల్లమల్ల వెంకటేశ్వరరావుపై తాజా కేసుతో కలిపి మొత్తం 4 కేసులు నమోదయ్యాయి.గతంలోనూ వీరు అక్రమ ఇసుక రవాణా, దొంగతనం, మోసం వంటి నేరాల్లో చురుకుగా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అలవాటుగా నేరాలకు పాల్పడుతున్న (Habitual Offenders) వీరిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వీరిపై హిస్టరీ షీట్లు, అవసరమైతే రౌడీ షీట్లు తెరిచి, నిరంతర నిఘా ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు…..
చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు తప్పవు: ఏసీపీ సారంగపాణి హెచ్చరిక….
అక్రమ ఇసుక రవాణాపై వైరా డివిజన్ ఏసీపీ సారంగపాణి సాదుల సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. పర్యావరణాన్ని దెబ్బతీస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే ఇటువంటి కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.“అక్రమ ఇసుక తవ్వకం, రవాణా, నిల్వ, కొనుగోలు లేదా విక్రయాలలో పాల్గొనే వ్యక్తులు, వాహన యజమానులు, డ్రైవర్లు, దళారులు ఎవరైనా సరే చట్టం ముందు నుంచి తప్పించుకోలేరు. అక్రమ ఇసుక మాఫియా ఏ రూపంలో ఉన్నా సహించబడదు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వాహనాలను శాశ్వతంగా సీజ్ చేయడం, హిస్టరీ షీట్లు తెరవడం వంటి కఠిన చర్యలు తీసుకుంటాం.” అలాగే, అక్రమ ఇసుక రవాణా, వ్యాపారాలకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, చట్ట పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని ఏసీపీ విజ్ఞప్తి చేశారు….
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
