కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రిని చేసేదాక విశ్రమించేది లేదు: పార్టీ శ్రేణులకు పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు!!

Pathi Sreenivas Rao
2 Min Read
Highlights
  • కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి ప్రాణపదం.. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే మన లక్ష్యం....
  • ప్రతి బూత్‌కు ఇద్దరు కార్యకర్తలతో కమిటీల ఏర్పాటు....
  • కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు....
  • సభ్యత్వ నమోదు సమన్వయకర్తల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్....

ఖమ్మం : క్షేత్రస్థాయిలో పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి కొండంత బలమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. పార్టీ అధినేత కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడమే ఏకైక లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా బుధవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఖమ్మం, వైరా, మధిర, ఇల్లందు నియోజకవర్గాల సమన్వయకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు….

ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమం అత్యంత కీలకమన్నారు. ఇందులో భాగంగా నాయకులు, కార్యకర్తలు ఎలాంటి బేషజాలకు పోకుండా సమిష్టిగా పనిచేయాలని కోరారు. సభ్యత్వ నమోదును పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రతి పోలింగ్ బూత్‌కు ఇద్దరు చురుకైన కార్యకర్తలతో ప్రత్యేక కమిటీలు వేసుకొని, పూర్తి నిబద్ధతతో ముందుకు సాగాలని సమన్వయకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు….

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆచరణ సాధ్యంకాని మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, వారు చేసిన మోసాలను గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు.
అధికార పక్షం బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన స్పష్టం చేశారు…..

రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మరలా ముఖ్యమంత్రిని చేసేంత వరకు గులాబీ శ్రేణులు విశ్రమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు
ఈ సమన్వయకర్తల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్ రావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ,నాయకులు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, ఖమర్, దిండిగాల రాజేందర్, మంజుల, గిరిబాబు, పగడాల నాగరాజు తదితర నాయకులు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article
Leave a Comment