తెలంగాణ /ఖమ్మం జిల్లా :
ఖమ్మం, జూలై 16: గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, దోపిడీకి గురై కునారిల్లిన ప్రాజెక్టులకు, మాజీ సీఎం కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుగా పునర్జీవం పోసి ప్రగతి పథంలో నడిపించారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును బేరీజు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ మంత్రులు తమ ఘనతగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు….
జలయజ్ఞం కాదు.. అది కాంగ్రెస్ ధనయజ్ఞం…..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులు అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్గా మారాయని పువ్వాడ విమర్శించారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిందని, మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని యథేచ్ఛగా దోచుకుందని ఆయన మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గోదావరి జలాలను ఒడిసిపట్టి 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలనే బృహత్తర లక్ష్యంతో కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని పువ్వాడ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుపై సుమారు రూ. 9 వేల కోట్లు వెచ్చించామని స్పష్టం చేశారు….అదే విధంగా 100 కిలోమీటర్లకు పైగా ప్రధాన కాలువలు, పంప్ హౌస్లు, పైప్లైన్ల నిర్మాణంతో పాటు అధిక సామర్థ్యం గల భారీ మోటార్లు, ఆధునిక యాంత్రిక పరికరాలు, ట్రాన్స్మిషన్ వ్యవస్థల ఏర్పాటు చేశామని
భూసేకరణ, అటవీ, పర్యావరణ అనుమతుల వంటి అత్యంత క్లిష్టమైన సమస్యలకు పరిష్కార మార్గం చూపామని ఈ కీలకమైన పనులన్నీ పూర్తి చేసి, ప్రాజెక్టును 90 శాతం మేర కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన ఉద్ఘాటించారు…..
ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీటి భరోసా….
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగర్ ఆయకట్టుకు శాశ్వత సాగునీటి భరోసా కల్పించడం కోసమే కేసీఆర్ ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని మాజీ మంత్రి తెలిపారు. తద్వారా వ్యవసాయాభివృద్ధి సాధించడం, భూగర్భ జలాలను పెంచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కేసీఆర్ ప్రధాన లక్ష్యాలని వివరించారు.అంతే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రుల తీరుపై పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సీతారామ ప్రాజెక్టుకు తాము ఎంత మేర నిధులు ఖర్చు చేశారో, చేసిన కృషి ఏంటో చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతోనే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై మంత్రులు అసత్య ప్రచారాలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన పనులనే తమ ఘనతగా చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని, కానీ ఎవరి కృషి ఏమిటో, వాస్తవాలు ఏమిటో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసని పువ్వాడ పేర్కొన్నారు…..
పత్తి శ్రీనివాస్, జనం ముచ్చట న్యూస్, హైదరాబాద్ :9703973456
