కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు,అబద్ధాలను ఎండగడతాం: మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ధ్వజం….

Pathi Sreenivas Rao
3 Min Read

మధిర, సెప్టెంబర్ 1: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్ నాయకుడు లింగాల కమల్‌రాజు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.మంగళవారం మధిరలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్లపై రాసి, దేవుడి సాక్షిగా ప్రమాణాలు చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ ఆదేశాలు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్‌రావు సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు….

ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మంత్రులు తమ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను, పార్టీ నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కమల్‌రాజు ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో ఉన్నప్పటికీ ఆయన పేరును ప్రస్తావించకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కరోజు కూడా గడవదని ఎద్దేవా చేశారు.అసెంబ్లీలో కేటీఆర్, హరీష్‌రావు ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోందని విమర్శించారు. ప్రజల సొమ్ముతో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ, ప్రభుత్వ పదవుల్లో లేని కుటుంబ సభ్యులకు కూడా ఎస్కార్టులు, గన్‌మెన్లు కేటాయించడం వంటి అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు….

మిగిలిన పాలనా కాలంలోనైనా రాజకీయ విమర్శలు, చిల్లర మాటలు పక్కనపెట్టి ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను తక్షణమే అమలు చేయాలని కమల్‌రాజు డిమాండ్ చేశారు.సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలిపారు. నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి, ఎమ్మార్వో కార్యాలయాల ఎదుట ధర్నాలు చేపడతామని పేర్కొన్నారు. వారం రోజుల పాటు కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన వివిధ వర్గాల ప్రజల తరఫున నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని వివరించారు….

మధిరలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు బిక్కి కృష్ణప్రసాద్, చిత్తారు నాగేశ్వరరావు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరు వెంకటేశ్వరరావు, అరిగ శ్రీనివాసరావు, అప్పారావు, బొగ్గుల భాస్కర్‌రెడ్డి, చావా వేణు, రంగిశెట్టి కోటేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, ఉమామహేశ్వరరావు, నాగులవంచ రామారావు, కోన నరేంద్ర, చిదిరాల, అబ్దుల్ ఖురేషి తదితరులు పాల్గొన్నారు….

📄 Generate e-Paper Clip
Share This Article