తెలంగాణా / ఖమ్మం జిల్లా :
ఖమ్మం: సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి.. సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ఉదాసీనతకు నిదర్శనమని ఆయన ఆరోపించారు….
“ఆడబిడ్డ భారం కాదు.. భరోసా” అనే భావనకు గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా రూపం ఇచ్చిందని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహం ఆర్థిక భారంగా మారకుండా ఈ పథకాలు అండగా నిలిచాయని అన్నారు….ఈ పథకాలను నిర్వీర్యం చేయడానికి కుట్రలు చేయడం లేదా రద్దు చేసే ప్రయత్నాలు చేయడం జరిగితే తెలంగాణ ఆడబిడ్డలు, వారి కుటుంబాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. పేద కుటుంబాల సంక్షేమానికి సంబంధించిన పథకాలపై ప్రభుత్వం స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు….
కల్యాణలక్ష్మి అంశం హైకోర్టు పరిధిలో ఉన్న సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోందని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. హైకోర్టు నాలుగుసార్లు గడువు ఇచ్చినా ప్రభుత్వం కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించారు.పేదింటి ఆడబిడ్డల ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో ప్రభుత్వం తన వాదనలను కోర్టు ముందు ఎందుకు సమర్థవంతంగా వినిపించలేకపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని హెచ్చరించారు.కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల విషయంలో ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా పేద కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు….
పత్తి శ్రీనివాస్,జనం ముచ్చట 9703973456
