Janam Muchata – Voice of the People | Telugu News Platformదేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం:మంత్రి పొంగులేటి!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 1:44 pm
Date of Publish : 31 May 2026, 2:41 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 154 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం:మంత్రి పొంగులేటి!!

దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయం:మంత్రి పొంగులేటి!!

కూసుమంచి (ఖమ్మం జిల్లా): దేవుళ్లు, మతాల పేరిట రాజకీయం చేయడం తమ ప్రభుత్వ విధానం కాదని, అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలవడమే ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలోని చారిత్రాత్మక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం (గణపేశ్వరాలయం) పునర్నిర్మాణ, అభివృద్ధి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. రూ.3.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ పనుల ప్రారంభోత్సవంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.లతో కలిసి మంత్రి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు….

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి మతం యొక్క ఆత్మగౌరవాన్ని, సంస్కృతిని కాపాడటమే తమ ప్రభుత్వ విధి అని పేర్కొన్నారు. కేవలం దేవాలయాలే కాకుండా.. చర్చిలు, మసీదుల అభివృద్ధికి కూడా తమ ప్రభుత్వం సమాన ప్రాధాన్యత ఇస్తుందని వివరించారు. ఇటీవల సమ్మక్క-సారలమ్మ జాతరను ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనమన్నారు…..

గత ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి వంద కోట్లు ఇస్తామని ప్రకటించి, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ప్రజలను, భక్తులను మోసం చేసిందని మంత్రి విమర్శించారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాద్రి ఆలయ సమగ్ర రూపురేఖలు మార్చేందుకు రూ.350 కోట్లు కేటాయించి పనులకు శంకుస్థాపన చేసిందని తెలిపారు. వారం, పది రోజుల్లోనే ఈ పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభమవుతాయని స్పష్టం చేశారు. ఆలయ పరిసరాల్లో భూసేకరణ కోసమే ప్రభుత్వం ఇప్పటికే రూ.68 కోట్లు ఖర్చు చేసిందని ఆయన వెల్లడించారు అదే విధంగా గోదావరి తీర పుణ్యక్షేత్రాల అభివృద్ధికి రూ.1,000 కోట్లు,బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో ఉన్న పుణ్యక్షేత్రాల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.1,000 కోట్లు మంజూరు చేసిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అందులో భాగంగానే చారిత్రాత్మక కూసుమంచి గణపేశ్వరాలయ పనులను కూడా ప్రాధాన్యత క్రమంలో చేపట్టామన్నారు. కాకతీయుల నాటి వైభవం ఉట్టిపడేలా ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు….ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇరిగేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ అర్చకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు….