Janam Muchata – Voice of the People | Telugu News Platformమంత్రి తుమ్మల శిబిరంలో అంతర్మధనం!! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 12 Aug 2026, 3:30 am
Date of Publish : 05 Mar 2026, 6:00 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 1494 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

మంత్రి తుమ్మల శిబిరంలో అంతర్మధనం!!

మంత్రి తుమ్మల శిబిరంలో అంతర్మధనం!!

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెల తొలగింపు అంశం మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రతిష్టను దిగజార్చిందనడంలో ఎటువంటి సందేహం లేదు,నలభై యేండ్ల రాజకీయ చరిత్రలో ఏనాడూ ఇన్ని ఆరోపణలు ఎదురుకున్న సందర్బం దాదాపు లేదనే చెప్పాలి,రాజకీయ ఆరోపణలు పక్కన పెడితే సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో చిన్న అవినీతి మచ్చ లేకుండా సాపీగా సాగుతున్న తరుణంలో కొంతమంది వ్యక్తులు, ప్రత్యర్థి పార్టీలు, కొన్ని మీడియా చానెల్స్ కలిసి చేసిన దుష్ప్రచారం వలన ఇన్నేళ్లుగా నిబద్దతతో కాపాడుకుంటు వస్తున్న పరువు ప్రతిష్టలు దిగజారాయనే అంతర్మధనంలో మంత్రి తుమ్మల రాజకీయ ఆరంభం నుండి ఆయనతో కలిసి నడిచిన ప్రధాన అనుచరులు ఉన్నట్లు తెలుస్తుంది,ఈ మొత్తం వ్యవహారం వెనుక ఏమి జరిగిందనేది త్వరలోనే బయటకు వస్తుందని తమ ఆశభావాన్ని వ్యక్తం చేసారు….

ముఖ్యంగా వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదల గుడిసెలు తొలగించే విషయంలో భిన్న వాదనలు విన్పిస్తున్నాయి, అసలు నిజంగా ఈ విషయంలో తుమ్మల ప్రమేయం ఉందా? ,ఒకవేళ ఉన్నా చట్టపరంగా ఎలా ఉంటే ఆలా వెళ్ళండని చెప్పి ఉంటాడు తప్ప నాలుగు జిల్లాల పోలీసులను మొహరించి పేదల గుడిసెలను ఇంత దారుణంగా కూల్చమని చెప్పి ఉండడు అనే వాదన ఖమ్మం జిల్లా ప్రజల్లో బలంగా వినిపిస్తుంది,వాస్తవానికి తుమ్మలకు ఇలాంటి వివాదాలకు స్వతహాగా దూరంగా ఉంటాడనే మంచి పేరు ఉంది, ప్రజా ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించని వ్యక్తిగా ఆయనకు ఖమ్మం జిల్లా ప్రజల్లో గుర్తింపు ఉంది, ఒక విధంగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారంలో కొంతమంది వ్యక్తులు చూపించిన అత్యుత్సాహం మంత్రి తుమ్మల కొంప ముంచిందని మంత్రి తుమ్మల అనుచరులు డైరెక్టుగానే వ్యాఖ్యానిస్తున్నారు….

ఈ విషయం ఒక్కటే కాకుండా తన క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యకలాపాలు కూడా కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి, క్యాంపు కార్యాలయాన్ని అడ్డాగా చేసుకుని అయిదుగురు వ్యక్తులు సృష్టిస్తున్న ఆరాచకాలు అన్నీ ఇన్ని కావు, సహాయం కోసం క్యాంపు కార్యాలయానికి వవ్భి వెళ్లే కార్యకర్తల విషయంలో ఇంచార్జిగా వ్యవహరించే ఒక వ్యక్తి కనీస మర్యాద లేకుండా మాట్లాడతాడని కార్యకర్తలు వాపోతున్నారు,తండ్రి క్యాంపు ఆఫీసులో చక్రం తిప్పుతుంటే కొడుకు మున్సిపాలిటీలో చక్రం తిప్పుతున్నాడని,చేసేది అటెండర్ ఉద్యోగం అయినప్పటికీ మంత్రి తుమ్మల పేరు చెప్పి తోటి ఉద్యోగులను బెదిరించి తన వ్యక్తిగత పైరవీల కోసం ఉద్యోగులను ఇబ్బందులకు గురించేస్తున్నాడని కార్పొరేషన్ ఉద్యోగులు గోడు వెళ్ళబుచ్చుకుంటున్నారు, ఇక్కడ ఒక విషయం నిశితంగా గమనిస్తే మంత్రి తుమ్మల గెలిచిన కొత్తలో క్యాంప్ ఆఫీసు కార్యకర్తలతో కిట కిట లాడేది కానీ కాలక్రమేణా అక్కడ పరిస్థితులను గమనించి మంత్రి తుమ్మల మీద అభిమానం ఉన్నప్పటికీ అటువైపు పోవడం కూడా మానేశామని కార్యకర్తలు చెప్పడం విశేషం,….

అంతే కాకుండా ఆ అయిదుగురు వ్యక్తులు నిత్యం క్యాంపు కార్యాలయంలో కూర్చుని మంత్రి వ్యక్తిగత సహాయకున్ని అడ్డం పెట్టుకుని రెవిన్యూ సంబంధిత వ్యవహారాలను చక్కబెట్టుకోవడంతో పాటు క్యాంపు కార్యాలయాన్ని అడ్డమైన సెటిల్మెంట్లకు అడ్డాగా మార్చారని,మంత్రి వ్యక్తిగత సహయకున్ని కలవడం కోసం వెళితే ఆయన ముందు ఆ ఐదుగురు వ్యక్తులు కూర్చుని కదిలే పరిస్థితి ఉండడదని, విషయం ఏదైనా ఉంటే మాకు చెప్పు మేము చూసుకుంటాం, ఆయనతో నీకేం పనంటూ సతాయిస్తారని కార్యకర్తలు వాపోతున్నారు, ముఖ్యంగా రఘునాధపాలెం మండలంలో ఒక సర్పంచ్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూముల అమ్మకం దగ్గర నుండి, మట్టి త్రవ్వకాలవరకు వీరి కనుసన్నలో జరుగున్నాయనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నాయి….

అదే విధంగా నిత్యం మంత్రి తుమ్మల వెంట వుండే ఇద్దరు ముఖ్య నాయకులపై కూడా తీవ్ర అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి,ఒక నాయకుడు మంత్రి తుమ్మలకు తెలియకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి,మంత్రి తుమ్మల పేరు చెప్పుకుంటూ పైరవీలే పరామవధిగా చేసుకుని కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నట్లు కార్యకర్తలు చెప్పడం విశేషం, మరో నాయకుడు నిత్యం ప్రత్యర్థి పార్టీల నాయకులకు టచ్ లో ఉంటూ, వాళ్లకు సహాయ సహకారాలు అందించడంతో పాటు తన వ్యాపార కేంద్రాన్ని అడ్డాగా చేసుకుని అనేక సివిల్, ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి,అంతే కాకుండా గత సార్వత్రిక ఎన్నికల్లో రఘునాథపాలెం మండల ఇంచార్జిగా వ్యవహరించిన నాయకునితో పాటు ఇద్దరు స్థానిక మండల నాయకులు ఒక సర్పంచ్, మాజీ సర్పంచులను అడ్డం పెట్టుకుని అక్రమంగా ప్రభుత్వ భూములు అమ్మకాలతో పాటు
అక్రమ మట్టి వ్యాపారాల్లో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వినీపస్తున్నాయి….

ఈ సందర్బంగా మంత్రి తుమ్మల కొంతమంది పాత తరం ప్రధాన అనుచరులు మాట్లాడుతూ నలభై యేండ్లుగా ఆయన అడుగు జాడల్లో నడిచామని ఆయనకు ఏనాడూ ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురు కాలేదని, ప్రజలకు ఉపయోగపడే పనులు తప్ప వ్యక్తిగత పనులు ఎవరికి చేయలేదని,మారిన రాజకీయ పరిస్థితుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన కొంతమంది అనుచరుల మూలంగా నలభై యేండ్లుగా నిలబెట్టుకున్న నిబద్దత, పరువు, ప్రతిష్టలు మంటగలిసి పోతున్నాయని,
ఇప్పటికైనా మంత్రి తుమ్మల అలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు…..