Janam Muchata – Voice of the People | Telugu News Platformగత కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి పొంగులేటి !! › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Aug 2026, 12:05 pm
Date of Publish : 04 Jan 2026, 7:24 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 462 💬 0
Telangana > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad

గత కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి పొంగులేటి !!

గత కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ మంత్రి పొంగులేటి !!

ఖమ్మం : గడిచిన పదేళ్లలో పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం గత ప్రభుత్వానికి లేదు. ఆత్మగౌరవంతో పేదవాడు తలదాచుకునే నీడ ఇవ్వకుండా పదేళ్లూ బొమ్మలు చూపి కాలక్షేపం చేశారు. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన మొదటి ఏడాదే రూ. 22,500 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టిందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీలో ఆదివారం పర్యటించి సుమారు రూ. 1.07 కోట్ల వ్యయంతో పలు అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో మంత్రి గత ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేశారు.....

సంక్షేమంలో సరికొత్త అధ్యాయం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లలా చూస్తోందని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హాస్టల్ విద్యార్థులకు చాలీచాలని బువ్వ పెట్టి ఇబ్బంది పెడితే, మన ప్రభుత్వం మెస్ ఛార్జీలు 40 శాతం, కాస్మెటిక్ ఛార్జీలు 200 శాతం పెంచిందని గుర్తుచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ ద్వారా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు, పాత కార్డుల్లో కొత్త పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేశామని వివరించారు.....

అభివృద్ధికి చిరునామా ఏదులాపురం....
టెంపుల్ సిటీలో రూ. 35 లక్షలు, చిన్నతండాలో రూ. 22 లక్షలు, సూర్యనగర్‌లో రూ. 25 లక్షలు, 4వ తరగతి ఉద్యోగుల కాలనీలో రూ. 25 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శ్రీకారం చుట్టారు. కాలనీల్లో పర్యటిస్తున్న సమయంలో మహిళలు తనను ఆపి సమస్యలు వివరించారని వారి కోరిక మేరకు మిగిలిపోయిన ప్రతి రోడ్డును, డ్రైన్‌ను పూర్తి చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. హైటెన్షన్ లైన్ల తొలగింపు వంటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు......

ప్రజల దీవెనలే మా బలం
ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వానికి ప్రజల దీవెనలు ఎప్పుడూ ఉండాలని మంత్రి కోరారు. రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా ఇందిరమ్మ ప్రభుత్వం అభ్యర్థుల పట్ల ఇదే ప్రేమ, అభిమానాలు చూపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి,సిపి సునీల్ దత్, మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు మద్దినేని బేబీ స్వర్ణ కుమారి,హరినాథ్ బాబు, వెంపటి రవి కుమార్, బానోత్ సురేష్ నాయక్,ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు…..