Janam Muchata – Voice of the People | Telugu News Platformతెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్–ఎల్లో కాంగ్రెస్’ పంచాయతీ… › e-Paper Clip Janam Muchata – Voice of the People | Telugu News Platform
Share: f 𝕏 in @
janammuchata.in 13 Sep 2026, 6:31 am
Date of Publish : 28 Aug 2026, 12:41 pm  |  Posted by : PATHI SREENIVAS RAO
👁 180 💬 0
Latest News > Bhadradri Kothagudem > Hyderabad > Khammam > Mahabubabad > Politics > Telangana

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్–ఎల్లో కాంగ్రెస్’ పంచాయతీ…

తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్–ఎల్లో కాంగ్రెస్’ పంచాయతీ…

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, టీడీపీ తదితర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతలకు ప్రాధాన్యత, పదవులు, పనుల బిల్లుల విషయంలో జరుగుతున్న పరిణామాలు.. పార్టీకి మొదటి నుంచి పనిచేస్తున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్’ శ్రేణుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఫిరాయింపు నేతల ఆధిపత్యాన్ని కొందరు కాంగ్రెస్ నాయకులు ‘ఎల్లో కాంగ్రెస్’గా అభివర్ణిస్తూ బహిరంగంగానే అసమ్మతి స్వరాన్ని వినిపిస్తున్నారు.
బిల్లుల విడుదలపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అసంతృప్తి
జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈ అంతర్గత అసంతృప్తికి మరింత ఆజ్యం పోశాయి. టీడీపీ, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించిన పనుల బిల్లులు విడుదల అవుతున్నాయని, అయితే తమలాంటి అసలైన కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన బిల్లుల విషయంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసిన నాయకులకు ప్రాధాన్యత దక్కడం లేదన్న భావనను ఆయన వ్యాఖ్యలు ప్రతిబింబించాయని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.....

వనపర్తి నియోజకవర్గంలోనూ ఇదే తరహా విభేదాలు బహిర్గతమయ్యాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన మేఘారెడ్డి తనపై, తన అనుచరులపై ఆధిపత్యం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.ఇక నియోజకవర్గంలోని కొంతమంది పాత కాంగ్రెస్ కార్యకర్తలు సైతం తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తమను రానివ్వడం లేదని, బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుడి అనుచరులకే అక్కడ ప్రాధాన్యత ఇస్తున్నారని వారు వాపోతున్నట్లు సమాచారం. దీంతో వనపర్తిలో పాత–కొత్త కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి....

కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో పార్టీ వ్యవహారాలపై ఇన్‌చార్జ్ మంత్రుల తీరుపై కూడా అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం తమ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్ మంత్రి ఒక్కసారి కూడా రాలేదని, పార్టీ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.దీంతో ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్న సమయంలో కూడా నియోజకవర్గ స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేయడంలో లోపాలున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి...

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీలో చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రులు సైతం ఆయన తీరుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయితే వారు బహిరంగంగా చెప్పలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం.ఇలాంటి వ్యాఖ్యలు పార్టీ అంతర్గత వ్యవహారాలపై మరోసారి చర్చకు తెరలేపాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నాయకుల మధ్య సమన్వయం ఎలా ఉంది? పార్టీ నిర్ణయాల్లో అందరికీ సముచిత ప్రాధాన్యత లభిస్తోందా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి....

కేవలం నియోజకవర్గ స్థాయి రాజకీయాలకే ఈ విభేదాలు పరిమితం కాలేదని కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. నామినేటెడ్ పదవులు, వివిధ కమిటీల ఇన్‌చార్జ్ పదవులు, పార్టీకి సంబంధించిన ఇతర కీలక బాధ్యతలు కూడా ఫిరాయింపు నేతలు లేదా వారి అనుచరులకే దక్కుతున్నాయనే అసంతృప్తి పాత కాంగ్రెస్ శ్రేణుల్లో ఉందని సమాచారం.ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు పదవులు దక్కకపోవడం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి మాత్రం కీలక బాధ్యతలు లభించడం తమలో తీవ్ర నిరాశను కలిగిస్తోందని కొందరు కార్యకర్తలు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది....

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకునే దశకు చేరుకుంది. మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదనే భావన పార్టీ శ్రేణుల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో ఇప్పటివరకు పదవులు, అధికారాన్ని అనుభవించిన తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మళ్లీ పాత కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇస్తామని చెప్పడం తమను అవమానించడమేనని కొందరు అసంతృప్త నేతలు మండిపడుతున్నట్లు సమాచారం.‘ఇన్నాళ్లు అధికారాన్ని, పదవులను అనుభవించి ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ కోసం మళ్లీ మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారా?’ అనే ప్రశ్నను పాత కాంగ్రెస్ కార్యకర్తలు లేవనెత్తుతున్నట్లు తెలుస్తోంది.....

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై పార్టీ అంతర్గతంగా వరుసగా ఫిర్యాదులు, విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా పరిస్థితిని గమనిస్తున్నట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో సమావేశాలు నిర్వహిస్తూ, అసంతృప్తికి కారణాలను తెలుసుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పార్టీలో నష్టపోయిన వర్గాలను సమన్వయం చేయడం, నాయకులు–కార్యకర్తల మధ్య విభేదాలను తగ్గించడం, ఎన్నికలకు ముందే పార్టీ శ్రేణుల్లో ఐక్యత తీసుకురావడం అధిష్ఠానానికి ప్రధాన సవాలుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి...

కాంగ్రెస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులను కలుపుకొని ముందుకు వెళ్లడం ఒకవైపు పార్టీ విస్తరణకు ఉపయోగపడినప్పటికీ.. అదే సమయంలో పాత కాంగ్రెస్ నాయకులు, కొత్తగా చేరిన నేతల మధ్య సమన్వయం లేకపోతే అది ఎన్నికల సమయంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రస్తుతం వినిపిస్తున్న ‘ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ ఎల్లో కాంగ్రెస్–ఫిరాయింపు కాంగ్రెస్’ నినాదం కేవలం నాయకుల మధ్య వివాదంగా కాకుండా క్షేత్రస్థాయి కార్యకర్తల్లోనూ బలపడితే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పకపోవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.అయితే, ఇవన్నీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు, కార్యకర్తలు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, ఆరోపణలు మాత్రమే. పార్టీ నాయకత్వం వీటిపై అధికారికంగా ఏ విధంగా స్పందిస్తుందన్నది కీలకంగా మారింది. ఎన్నికలు సమీపించే కొద్దీ ఈ అంతర్గత విభేదాలు సద్దుమణుగుతాయా? లేక మరింత ముదిరి పార్టీ ఎన్నికల వ్యూహాన్నే ప్రభావితం చేస్తాయా? అన్నది వేచి చూడాల్సిందే....